సినీ పరిశ్రమను బెదిరించొద్దు...పిలిచి చర్చించండి...పవన్ కళ్యాణ్ ప్రకటనపై సిపిఐ(యం) స్పందన...
సినీ పరిశ్రమను బెదిరించొద్దు...పిలిచి చర్చించండి...
పవన్ కళ్యాణ్ ప్రకటనపై సిపిఐ(యం) స్పందన...
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
రాష్ట్రంలో సింగిల్ థియేటర్ యజమానులు తమ సమస్యల పరిష్కారం కోసం థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం సినిమా పరిశ్రమని బెదిరిస్తూ వాళ్లు తమ దగ్గరికి చర్చలకు రావాలని,గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరటం బెదిరించే పద్ధతిలో ఉన్నదని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదే సినిమా రంగం నుండి వచ్చి ఈ రకంగా మొత్తం పరిశ్రమనే బెదిరించి తమ వద్దకు తెచ్చుకోవాలనే పద్ధతిలో వ్యవహరించడం సరికాదన్నారు. సినిమా నిర్మాతలు,థియేటర్ల యజమానుల సమస్యలు ఏమిటో తెలుసుకొని సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేయాలని, అందుకోసం ఆయా సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించి చర్చించాలని కోరారు.రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైనా ఇంతవరకు ఇక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధి కాలేదన్నారు.సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. స్టూడియోలు నిర్మించుకొని విస్తరించడానికి ప్రభుత్వం దోహదపడాలని తెలిపారు.కావున వేలాది మంది కళాకారులు,ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఆధారపడే సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ రంగంలోని ప్రముఖులను,థియేటర్లు, 24 క్రాఫ్ట్స్కు సంబంధించిన సంఘాలను పిలిచి పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
Comments
Post a Comment